౧౯
౧ ఇది ఐగుప్తు దేశాన్ని గూర్చిన దైవ ప్రకటన.
చూడండి! యెహోవా వడిగా పరిగెత్తే మేఘంపై స్వారీ చేస్తూ ఐగుప్తుకి వస్తున్నాడు.
ఐగుప్తు విగ్రహాలు ఆయన సమక్షంలో కంపిస్తున్నాయి. ఐగుప్తు ప్రజల గుండెలు అవిసిపోతున్నాయి.
౨  “నేను ఐగుప్తు ప్రజలకు వ్యతిరేకంగా ఐగుప్తు ప్రజలను రేపుతాను. సోదరుడికి వ్యతిరేకంగా సోదరుడూ, పొరుగువాడికి వ్యతిరేకంగా పొరుగువాడూ పోరాటం చేస్తారు.
పట్టణంతో పట్టణం, రాజ్యంతో రాజ్యం యుద్ధం చేస్తాయి.
౩ ఐగుప్తు ప్రజల ఆత్మస్థైర్యం క్షీణిస్తుంది. నేను వాళ్ళ ఆలోచనలను నాశనం చేస్తాను.
వాళ్ళు ఆలోచన కోసం విగ్రహాల దగ్గరికీ, ఆత్మలతో మాట్లాడే వాళ్ళ దగ్గరికీ, కర్ణ పిశాచం ఉన్న వాళ్ళ దగ్గరికీ, సోదె చెప్పేవాళ్ల దగ్గరికీ వెళ్తారు.
౪ నేను ఐగుప్తు ప్రజలను క్రూరుడైన యజమాని చేతికి అప్పగిస్తాను. పీడించే రాజు వాళ్ళని పరిపాలిస్తాడు.”
ఇది సేనల ప్రభువు అయిన యెహోవా చేస్తున్న ప్రకటన.
౫ సముద్రంలో నీళ్ళు ఇంకిపోతాయి. నదులు ఎండిపోయి ఖాళీ అవుతాయి.
౬ నదుల నుండి దుర్వాసన వస్తుంది. ఐగుప్తు ప్రవాహాలు క్షీణించి పోయి ఎండిపోతాయి.
రెల్లూ, తుంగా వడిలిపోతాయి.
౭ నైలునదీ తీరాన, నదీ ముఖంలోనూ ఉండే రెల్లు పొదలన్నీ, నైలు నదీ పరీవాహక ప్రాంతంలో నాటిన పొలాలన్నీ ఎండిపోయి దూళిలా కొట్టుకు పోతాయి.
౮ జాలరులు శోకిస్తారు. విలపిస్తారు. నైలు నది నీళ్ళలో గేలాలు వేసే వాళ్ళంతా దుఖిస్తారు.
అలాగే నదిలో వలలు వేసే వాళ్ళు విలపిస్తారు.
౯ చిక్కులు తీసిన జనపనారతో అల్లికపని చేసే వాళ్ళూ, తెల్లని బట్టలు నేసే వాళ్ళూ తెల్లబోతారు.
౧౦ ఐగుప్తులో నేత పనులు చేసే వాళ్ళంతా చితికి పోతారు. కూలి పనులు చేసుకునే వాళ్ళంతా తీవ్ర నిస్పృహకు లోనవుతారు.
౧౧ సోయను అధిపతులు బొత్తిగా మూర్ఖులు. ఫరో దగ్గర ఉన్న సలహాదారుల్లో అందరికన్నా జ్ఞాని అయిన వాడు ఇచ్చిన సలహా మతిలేనిదిగా కన్పిస్తుంది. ఫరోతో “నేను జ్ఞాని కొడుకును. నేను పూర్వ కాలంలోని రాజుల సంతతి వాణ్ణి” అని నువ్వు ఎలా చెప్తావు?
౧౨ నీ జ్ఞానులు ఎక్కడ ఉన్నారు? సేనల ప్రభువైన యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన ప్రణాళికను వాళ్ళని చెప్పనియ్యి.
౧౩ సోయను అధిపతులు మూర్ఖులయ్యారు. నోపు పట్టణ అధిపతులు మోసపోయారు. ఐగుప్తు జాతులకు మూల స్తంభాలుగా ఉన్న వీళ్ళు ఐగుప్తును తప్పుదారి పట్టించారు.
౧౪ యెహోవా వాళ్ళ ఆలోచనలను తారుమారు చేసే ఆత్మను వాళ్ళ మనస్సుల్లో పెట్టాడు. మత్తులో తూలే తాగుబోతు తన వాంతిలో పొర్లినట్టు ఐగుప్తు చేసే పని అంతట్లో వాళ్ళు దాన్ని తప్పుదారి పట్టించారు.
౧౫ తల అయినా తోక అయినా తాటి మట్ట అయినా రెల్లయినా ఐగుప్తు కోసం ఎవరూ చేయగలిగిందేమీ లేదు.
౧౬ ఆ రోజున ఐగుప్తు ప్రజలంతా స్త్రీల వలే ఉంటారు. సేనల ప్రభువు అయిన యెహోవా వారిపై తన చెయ్యి ఎత్తుతాడు. దాని కారణంగా వాళ్ళు భయపడి వణుకుతారు. ౧౭ ఐగుప్తు అధైర్య పడడానికి యూదాదేశం కారణమవుతుంది. తమకు విరోధంగా యెహోవా ఆలోచించిన ప్రణాళికల కారణంగా వాళ్ళు యూదా దేశం అంటే భయపడి పోతారు.
౧౮ ఆ రోజున కనాను భాషలో మాట్లాడే పట్టణాలు ఐదు ఐగుప్తు దేశంలో ఉంటాయి. ఆ పట్టణాల్లో ప్రజలు “మేము సేనల ప్రభువు యెహోవా ప్రజలం” అని ప్రమాణం చేస్తారు. ఈ పట్టణాల్లో ఒక దాన్ని “నాశనపురం” అని పిలుస్తారు.
౧౯ ఆ రోజున ఐగుప్తు దేశం మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. దాని సరిహద్దులో యెహోవాకు ప్రతిష్ట చేసిన రాతి స్తంభం ఒకటి ఉంటుంది. ౨౦ అది ఐగుప్తు దేశంలో సేనల ప్రభువు అయిన యెహోవాకు ఒక సూచనగానూ, సాక్ష్యంగానూ ఉంటుంది. వాళ్ళు తమను పీడించే వాళ్ళని గూర్చి యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన వాళ్ళ కోసం శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపిస్తాడు. అతడు వాళ్ళని విడిపిస్తాడు.
౨౧ ఐగుప్తు ప్రజలకు యెహోవా తనను తెలియపరచుకుంటాడు. ఆ రోజున ఐగుప్తు ప్రజలు యెహోవాను తెలుసుకుంటారు. వాళ్ళు ఆయనను బలులతో, కానుకలతో ఆరాధిస్తారు. యెహోవాకు మొక్కుకుని ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తారు. ౨౨ యెహోవా వాళ్ళని బాధిస్తాడు. వాళ్ళని బాధించి తిరిగి బాగు చేస్తాడు. వాళ్ళు యెహోవా వైపు తిరుగుతారు. ఆయన వాళ్ళ ప్రార్థన విని వాళ్ళను స్వస్థపరుస్తాడు.
౨౩ ఆ రోజున ఐగుప్తు దేశం నుండి అష్షూరు దేశానికి ఒక రాజ మార్గం ఉంటుంది. అష్షూరు ప్రజలు ఐగుప్తుకీ, ఐగుప్తు ప్రజలు అష్షూరుకీ వస్తూ పోతూ ఉంటారు. ఐగుప్తు ప్రజలు అష్షూరు ప్రజలతో కలసి యెహోవాను ఆరాధిస్తారు.
౨౪ ఆ రోజున ఐగుప్తు, అష్షూరులతో పాటు ఇశ్రాయేలు మూడో జనంగా భూమిపై ఆశీర్వాద కారకంగా ఉంటుంది.
౨౫ సేనల ప్రభువు అయిన యెహోవా వాళ్ళను దీవించి ఇలా అంటాడు. “నా జనమైన ఐగుప్తు ప్రజలు, నా చేతి పని అయిన అష్షూరు ప్రజలు, నా సంపద అయిన ఇశ్రాయేలు ప్రజలు దీవెనలు పొందుదురు గాక.”