౨౦
౧ అష్షూరు రాజు సర్గోను తర్తానుని అష్డోదుకి పంపాడు. తర్తాను ఆ సంవత్సరం అష్డోదు ప్రజలతో యుద్ధం చేసి ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు.
౨ ఆ రోజుల్లో యెహోవా ఆమోజు కొడుకు యెషయా ద్వారా మాట్లాడి ఇలా చెప్పాడు. “నువ్వు వెళ్ళు. నీ నడుముకి కట్టుకున్న గోనె పట్టా విప్పు. నీ పాదాలకున్న జోళ్ళు విడిచిపెట్టు.” అతడు అలాగే చేశాడు. చెప్పులు లేకుండా, వట్టి కాళ్ళతో నడిచాడు.
౩ అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “ఐగుప్తు, ఇతియోపియాలకు ఒక సూచనగా, ఒక శకునంగా నా సేవకుడు యెషయా మూడు సంవత్సరాలు నగ్నంగా, పాదరక్షలు లేకుండా తిరిగాడు.
౪ అలాగే అష్షూరు రాజు బందీలుగా ఉన్న ఐగుప్తు ప్రజలనూ, ప్రవాసులైన ఇతియోపియా ప్రజలనూ వాళ్ళలో పిల్లలనూ, పెద్దలనూ దిగంబరులుగా చేసి పాదరక్షలు లేకుండా తీసుకు వెళ్తాడు. ఐగుప్తు ప్రజలకు అవమానం కలిగేలా వాళ్ళ పిరుదులపై బట్టలు లేకుండా చేసి తీసుకుపోతాడు.
౫ వాళ్ళు ఇతియోపియా ప్రజలపై నమ్మకం ఉంచి, ఐగుప్తును తమకు గర్వకారణంగా ఎంచారు కాబట్టి వాళ్ళు దిగులు పడతారు. సిగ్గుపడిపోతారు.
౬ ఆ రోజున ఆ సముద్ర తీరాల్లో నివసించే వాళ్ళు అష్షూరు రాజు నుండి తప్పించుకోవాలని ‘మనం సహాయం కోసం వీళ్ళ దగ్గరకి పరుగు తీశాం. నిజంగా వీళ్ళే మనకు ఆధారమని నమ్మాం. ఇప్పుడు మనం ఎలా తప్పించుకుంటాం?’ అని చెప్పుకుంటారు.”