౧  “బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌ హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి.
ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది.
౨ సుందరసుకుమారి సీయోను కన్యను పూర్తిగా నాశనం చేస్తాను.
౩ కాపరులు తమ గొర్రెల మందలతో దానిలోకి వస్తారు. దాని చుట్టూ గుడారాలు వేస్తారు.
ప్రతివాడూ తన కిష్టమైన చోట మందను మేపుతాడు.
౪ యెహోవా పేరున ఆమెతో యుద్ధానికి సిద్ధపడండి. లెండి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం.
అయ్యో, పొద్దుగుంకిపోతున్నది. సాయంకాలపు నీడలు సాగిపోతున్నాయి.
౫ కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం.
౬ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే “చెట్లు నరికి యెరూషలేమును చుట్టూ ముట్టడించండి.
ఈ పట్టణం నిండా అన్యాయమే జరుగుతున్నది. కాబట్టి దాన్ని శిక్షించడం న్యాయమే.
౭ ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది.
దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి.
౮ యెరూషలేమా, నేను నీ దగ్గర నుండి తొలగి పోకుండేలా, నేను నిన్ను నిర్జనమైన ప్రదేశంగా చేయకుండేలా దిద్దుబాటుకు లోబడు.”
౯ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే “ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు.
ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.”
౧౦ నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు.
ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.
౧౧ కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను.
వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది.
భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.
౧౨ వారికిక ఏమీ మిగలదు. వారి ఇళ్ళు, వారి పొలాలు, వారి భార్యలు, మొత్తాన్ని ఇతరులు తీసుకు వెళ్లి పోతారు.
ఎందుకంటే ఈ దేశ ప్రజల మీద నేను నా చెయ్యి చాపి వారిని ఎదిరిస్తాను. ఇదే యెహోవా వాక్కు
౧౩  “వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.
౧౪ శాంతి లేని సమయంలో వారు శాంతి, సమాధానం అని ప్రకటిస్తూ నా ప్రజల గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు.
౧౫ వారు చేస్తున్న అసహ్యకార్యాలను బట్టి వారు సిగ్గుపడాలి. అయితే వారు ఏమాత్రం సిగ్గుపడరు.
తాము అవమానం పాలయ్యామని వారికి తోచడం లేదు.
కాబట్టి నేను వారికి తీర్పు తీర్చే కాలంలో పడిపోయే వారితో వారు కూడా పడిపోతారు.
వారు కూలిపోతారు” అని యెహోవా సెలవిస్తున్నాడు.
౧౬ యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి.
“ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?” అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది.
అయితే వారు “మేము అందులో నడవం” అని చెబుతున్నారు.
౧౭ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి నేను కావలి వారిని ఉంచాను. అదిగో, వారు చేసే బూరధ్వని వినండి.
౧౮ అయితే “మేము వినం” అని వారంటున్నారు. కాబట్టి, అన్యజనులారా, వినండి. సాక్షులారా, వారికేం జరగబోతున్నదో చూడండి.
౧౯ భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు.
కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.
౨౦ షేబ దేశం నుండి వచ్చే సాంబ్రాణి నాకెందుకు? సుదూర దేశం నుండి తీసుకొచ్చిన మధురమైన సువాసన గల నూనె నాకెందుకు?
మీ దహనబలులు నాకిష్టం లేదు. మీ బలులు నాకు సంతోషం కలిగించడం లేదు.
౨౧ కాబట్టి యెహోవా చెప్పేదేమంటే, చూడండి, ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఒక అడ్డుబండను వేయబోతున్నాను.
తండ్రులూ కొడుకులూ అందరూ అది తగిలి కూలిపోతారు. అక్కడి నివాసులు, వారి పొరుగువారు కూడా నశిస్తారు.
౨౨ యెహోవా చెప్పేదేమంటే, ఉత్తర దిక్కునుండి ఒక జనాంగం వస్తూ ఉంది.
ఎక్కడో దూర ప్రాంతం నుండి ఒక మహా గొప్ప రాజ్యం బయలు దేరింది.
౨౩ వారు బాణాలు, ఈటెలు వాడతారు. వారు జాలిలేని క్రూర జనాంగం. వారి స్వరం సముద్ర ఘోషలాగా ఉంటుంది.
సీయోను కుమార్తెలారా, వారు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తారు. నీతో యుద్ధం చేయడానికి వారు యోధుల్లాగా బారులు తీరి ఉన్నారు.
౨౪ వారి గురించిన వార్త విని నిస్పృహతో మా చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించే స్త్రీ నొప్పుల వంటి వేదన పడుతున్నాము.
౨౫ బయట పొలంలోకి వెళ్ళవద్దు. రహదారుల్లో నడవవద్దు. మా చుట్టూ కదులుతున్న శత్రువుల కత్తులు చూసి అంతటా భయం ఆవరించింది.
౨౬ నా ప్రజలారా, వినాశనకారి హఠాత్తుగా మా మీదికి వస్తాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకోండి.
ఒక్కడే కొడుకును గూర్చి ఎలా దుఃఖిస్తారో ఆ విధంగా విలపించండి. బహు ఘోరంగా విలపించండి.
౨౭ యిర్మీయా, నిన్ను నా ప్రజలకు మెరుగు పెట్టేవాడిగా, వారిని నీకు లోహపు ముద్దగా నేను నియమించాను.
ఎందుకంటే నువ్వు వారి ప్రవర్తనను పరిశీలించి తెలుసుకోవాలి.
౨౮ వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.
౨౯ కొలిమి తిత్తులు మంటల్లో కాలిపోతున్నాయి. ఆ జ్వాలల్లో సీసం తగలబడి పోతున్నది.
అలా మండిస్తూ ఉండడం నిష్ప్రయోజనం. దుష్టులను వేరు చేయడం వీలు కాదు.
౩౦ వారిని “పారవేయాల్సిన వెండి” అని పిలవాలి. ఎందుకంటే యెహోవా వారిని పూర్తిగా తోసిపుచ్చాడు.