౧ యెహోవా చెప్పేదేమంటే “ఆ సమయంలో మీ శత్రువులు యూదా రాజుల, వారి అధిపతుల ఎముకలను, యాజకుల, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను వారి సమాధుల్లో నుండి బయటికి తీస్తారు. ౨ వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి. ౩ ఈ దుర్మార్గ దేశంలో ఇంకా మిగిలి ఉన్నవారు నేను వారిని చెదర గొట్టిన స్థలాల్లో జీవానికి బదులు చావును కోరుకుంటారు. సేనల ప్రభువైన యెహోవా వాక్కు ఇదే.
౪ యెహోవా ఇలా చెబుతున్నాడని వారితో చెప్పు. ‘కిందపడిన మనుషులు లేవకుండా ఉంటారా? దారి తప్పిపోయిన వారు తిరిగి రావడానికి ప్రయత్నించకుండా ఉంటారా?’
౫ మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు?
వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు?
౬ నేను వారి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. కానీ వారు ఒక్కటి కూడా మంచి మాట పలకలేదు.
‘నేనిలా చేశానేమిటి?’ అని తన తన చెడ్డ పని గురించి పశ్చాత్తాపపడే వాడు ఒక్కడూ లేడు.
యుద్ధంలోకి చొరబడే గుర్రం లాగా ప్రతివాడూ తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు.
౭ ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు దాని కాలాలు తెలుసు. తెల్ల గువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకులకు అవి తిరిగి రావలసిన సమయాలు తెలుసు.
అయితే నా ప్రజలకు యెహోవా న్యాయవిధి తెలియదు.
౮ ‘మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది’ అని మీరెందుకు అంటున్నారు?
నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు.
౯ జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు.
వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?
౧౦ కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను.
చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.
౧౧ శాంతి లేని సమయంలో వారు ‘శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు’ అని పలుకుతూ నా ప్రజల గాయాలకు పైపై పూత పూస్తారు.
౧౨ వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు.
అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు.
నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు.
౧౩ నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను. ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి.
నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు.
౧౪ ‘మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం? మనమంతా కలిసి ప్రాకారాలున్న పట్టణాల్లోకి వెళ్ళి అక్కడే చచ్చిపోదాం రండి.
యెహోవాయే మనలను నాశనం చేస్తున్నాడు. మనం ఆయనకు విరోధంగా పాపం చేశాం కాబట్టి మన దేవుడు యెహోవా మనకు విషజలం తాగించాడు.
౧౫ మనం శాంతి సమాధానాల కోసం కనిపెట్టుకుని ఉన్నాం గానీ మనకేమీ మంచి జరగలేదు.
క్షేమం కోసం కనిపెడుతున్నాం గానీ భయమే కలుగుతూ ఉంది’ అని వారు చెబుతారు.
౧౬ దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది.
వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.
౧౭ యెహోవా చెప్పేదేమంటే, ‘నేను పాములనూ, కాలనాగులనూ మీ మధ్యకు పంపిస్తాను. అవి మిమ్మల్ని కాటు వేస్తాయి. వాటికి విరుగుడు మంత్రం ఏమీ లేదు.’
౧౮ నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది?
౧౯ యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఆమెలో లేడా? అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదనలు వినబడుతున్నాయి.
వారి విగ్రహాలను ఇతర దేశాల మాయ దేవుళ్ళను పెట్టుకుని నాకు ఎందుకు కోపం తెప్పించారు?
౨౦ కోత కాలం గతించిపోయింది. ఎండాకాలం దాటిపోయింది. మనకింకా రక్షణ దొరకలేదు అని చెబుతారు.
౨౧ నా జనుల వేదన చూసి నేనూ వేదన చెందుతున్నాను, వారికి జరిగిన ఘోరమైన సంగతులను బట్టి నేను రోదిస్తున్నాను. విపరీతమైన భయం నన్ను ఆవరించింది.
౨౨ గిలాదులో ఔషధం ఏమీ లేదా? అక్కడ వైద్యుడెవరూ లేరా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగడం లేదు?