౨౩
౧  “నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.” ఇది యెహోవా వాక్కు.
౨ ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన ప్రజలను మేపే కాపరులను గురించి ఇలా చెబుతున్నాడు. “మీరు నా గొర్రెలను చెదరగొట్టి వెళ్ళగొట్టారు. మీరు వాటిని అసలేమీ పట్టించుకోలేదు. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
౩ నేను వాటిని తోలి వేసిన దేశాలన్నిటిలో నుంచి మిగిలిన నా గొర్రెలను దగ్గరికి చేరుస్తాను. వాటి మేత భూములకు వాటిని రప్పిస్తాను. అవి వృద్ధి చెంది విస్తరిస్తాయి.
౪ నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. ఇకనుంచి అవి భయపడకుండా, బెదరి పోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపుతారు. ఇది యెహోవా వాక్కు.”
౫ యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
౬ ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు.”
౭ కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు “ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా జీవం తోడు” అని ఇకపై ప్రమాణం చెయ్యరు.
౮  “ఉత్తర దేశంలో నుంచి, నేను వారిని చెదరగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వారిని రప్పించిన యెహోవానైన నా తోడు” అని ప్రమాణం చేస్తారు. వాళ్ళు తమ దేశంలో నివసిస్తారు అని యెహోవా చెబుతున్నాడు.
౯ ప్రవక్తల గూర్చిన సమాచారం. యెహోవా గురించి, ఆయన పరిశుద్ధమైన మాటలను గురించి నా గుండె నాలో పగిలిపోయింది. నా ఎముకలన్నీ వణికి పోతున్నాయి. నేను మత్తు మందు సేవించినవాడిలా అయ్యాను. ద్రాక్షమద్యం వశమైన వాడిలా అయ్యాను.
౧౦ దేశం వ్యభిచారులతో నిండిపోయింది. వారిని బట్టే దేశం దుఃఖిస్తూ ఉంది. ఎడారిలో పచ్చిక మైదానాలు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. తమ బలాన్ని సరిగా వాడడం లేదు.
౧౧ ప్రవక్తలూ యాజకులూ పాడైపోయారు. నా ఆలయంలో కూడా వాళ్ళ దుర్మార్గం నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
౧౨ కాబట్టి చీకట్లో వాళ్ళ దారి జారిపోయే నేలలాగా ఉంటుంది. వాళ్ళను గెంటేస్తారు. వాళ్ళు దానిలో పడిపోతారు. వాళ్ళను శిక్షించే సంవత్సరంలో వాళ్ళ మీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.
౧౩ సమరయ ప్రవక్తల మధ్య నేరం చూశాను. వాళ్ళు బయలు దేవుడి పేర ప్రవచనం చెప్పి నా ఇశ్రాయేలు ప్రజలను దారి తప్పించారు.
౧౪ యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.
౧౫ కాబట్టి సేనల ప్రభువు యెహోవా ఈ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది. కాబట్టి వాళ్లకు తినడానికి చేదుకూరలూ తాగడానికి విషజలం నేను వారికిస్తాను.
౧౬ సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు.”
౧౭  “మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు” అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. “మీ మీదికి ఏ కీడూ రాదు” అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు.
౧౮ అయితే యెహోవా మాట విని గ్రహించడానికి వాళ్ళలో ఆయన సభలో ఎవరు నిలబడ్డారు? ఆయన మాట ఎవరు విని పట్టించుకున్నారు?
౧౯ ఇదిగో యెహోవా ఆగ్రహం తుఫానులాగా బయలుదేరింది. అది తీవ్రమైన సుడిగాలిలాగా దుర్మార్గుల తల మీదికి విరుచుకుపడుతుంది.
౨౦ తన మనస్సులోని ఆలోచనలను నెరవేర్చి సాధించే వరకూ యెహోవా కోపం చల్లారదు. చివరి రోజుల్లో ఈ విషయం మీరు బాగా తెలుసుకుంటారు.
౨౧  “నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవచించారు.
౨౨ ఒకవేళ వాళ్ళు నా సలహా మండలిలో నిలబడి ఉంటే, వాళ్ళు నా మాటలు నా ప్రజలకు తెలియజేసే వాళ్ళే. వాళ్ళ చెడ్డ మాటల నుంచి, వాళ్ళ దుర్మార్గపు అలవాట్ల నుంచి వాళ్ళను తప్పించి ఉండే వాళ్ళే.”
౨౩ యెహోవా చెప్పేదేమిటంటే “నేను దగ్గరలో మాత్రమే ఉన్న దేవుడినా? దూరంగా ఉన్న దేవుణ్ణి కానా?
౨౪ నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో ఎవరైనా దాక్కోగలరా? అని యెహోవా అడుగుతున్నాడు. నేను భూమ్యాకాశాల్లో ఉన్నాను కదా? ఇది యెహోవా వాక్కు.”
౨౫  “నా పేర మోసపు మాటలు ప్రవచించే ప్రవక్తల మాటలు నేను విన్నాను. ‘నాకు కల వచ్చింది! నాకు కల వచ్చింది’ అని వాళ్ళు చెబుతున్నారు.”
౨౬ ఎంతకాలం ఇలా జరగాలి? ప్రవక్తలు తమ మనస్సులో నుంచి అబద్ధాలు ప్రవచిస్తున్నారు. తమ హృదయాల్లోని మోసంతో ప్రవచిస్తున్నారు.
౨౭ బయలు దేవతను పూజిస్తూ తమ పూర్వీకులు నా పేరును మరచిపోయినట్టు ప్రతివాడూ తమ పొరుగు వారితో చెప్పే కలలతో నా ప్రజలు నా పేరును మరచిపోవాలని ఆలోచిస్తున్నారు.
౨౮ కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు. అయితే ఎవడికి నేను నా వాక్కు వెల్లడించానో అతడు దాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏం సంబంధం? ఇదే యెహోవా వాక్కు.
౨౯  “నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేసే సుత్తి లాంటిది కాదా?
౩౦ కాబట్టి ఒకడి దగ్గర నుంచి మరొకడు నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను విరోధిని.” ఇది యెహోవా వాక్కు.
౩౧  “సొంత మాటలు పలుకుతూ వాటినే దేవోక్తులుగా ప్రకటించే ప్రవక్తలకు నేను విరోధిని.” ఇది యెహోవా వాక్కు.
౩౨  “మోసపు కలలను పలికే వాళ్లకు నేను విరోధిని. వాళ్ళు అబద్ధాలు చెబుతూ మోసంతో గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.” ఇది యెహోవా వాక్కు. “నేను వాళ్ళను పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వాళ్ళ వలన ఈ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు.” ఇదే యెహోవా వాక్కు.
౩౩ ఈ ప్రజలు గానీ ప్రవక్త గానీ యాజకుడు గానీ నిన్ను “యెహోవా సందేశం ఏమిటి?” అని అడిగితే నువ్వు వారితో ఇలా చెప్పు. “ఏ సందేశం? నేను మిమ్మల్ని వదిలేశాను.” ఇది యెహోవా సందేశం.
౩౪  “ఇదే యెహోవా సందేశం” అని ప్రవక్త గానీ యాజకుడు గానీ ప్రజలు గానీ అంటే, అతన్నీ అతని కుటుంబాన్నీ శిక్షిస్తాను.
౩౫ అయితే “యెహోవా జవాబేమిటి? యెహోవా ఏం చెప్పాడు?” అని మీరు మీ పొరుగువారితో మీ సోదరులతో చెప్పాలి. ౩౬  “యెహోవా సందేశం” అనే మాట మీరికమీదట పలకవద్దు. ఎందుకంటే ఎవడి మాట వాడికి సందేశం అవుతుంది. జీవంగల మన దేవుని మాటలను, సేనల అధిపతి అయిన యెహోవా దేవుని మాటలను, మీరు తారుమారు చేశారు.
౩౭ మీరు మీ ప్రవక్తతో ఇలా చెప్పాలి. “యెహోవా నీకేం జవాబు చెప్పాడు? యెహోవా ఏం చెప్పాడు?”
౩౮ అయితే మీరు “ఇది యెహోవా సందేశం” అని చెబితే యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఇది యెహోవా సందేశం” అని మీరు చెప్పకూడదని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినా మీరు యెహోవా సందేశం అంటున్నారు.
౩౯ కాబట్టి నేను మిమ్మల్ని ఏరి నా దగ్గర నుంచి పారవేస్తాను. మీకూ మీ పూర్వీకులకూ నేనిచ్చిన పట్టణాన్నీ పారవేస్తాను.
౪౦ ఎప్పటికీ నిలిచి ఉండే నిందనూ అవమానాన్నీ మీ మీదికి రప్పిస్తాను.