౨౪
౧ బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు.
౨ ఒక గంపలో మగ్గిన అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండవ గంపలో తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరు పళ్ళు ఉన్నాయి.
౩  “యిర్మీయా! నువ్వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను ఆడిగాడు. అందుకు నేను “అంజూరు పళ్ళు. మంచివి చాలా బాగున్నాన్నాయి. చెడ్డవి బాగా కుళ్ళిపోయాయి. తినడానికి పనికి రావు.” అన్నాను.
౪ అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. ౫  “ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, వారికి మేలు కలగాలని యూదావారిలో కొంతమందిని బందీలుగా ఈ స్థలం నుంచి నేను కల్దీయుల దేశానికి పంపించాను. వాళ్ళను ఈ మంచి అంజూరు పళ్ళలాగా ఎంచుతాను. ౬ వాళ్లకు మేలు కలగడానికి నేను వాళ్ళ మీద దృష్టి పెడతాను. ఈ దేశానికి వాళ్ళను మళ్ళీ తీసుకువస్తాను. నేను వాళ్ళను పడగొట్టకుండా కడతాను. పెళ్లగించకుండా నాటుతాను. ౭ నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.”
౮  “యూదా రాజు సిద్కియానూ అతని అధికారులనూ దేశంలో మిగిలిన వాళ్ళనూ ఐగుప్తు దేశంలో నివసించే వాళ్ళనూ బాగా చెడిపోయి తినడానికి పనికిరాని ఆ కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలాగా ఉంచుతానని యెహోవా చెబుతున్నాడు. ౯ వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను. ౧౦ నేను వారికీ వాళ్ళ పూర్వీకులకూ ఇచ్చిన దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనమయ్యే వరకూ నేను కత్తినీ కరువునూ అంటు వ్యాధుల్నీ వాళ్లలోకి పంపుతాను.”