౧ శపితమైనదాన్ని నాశనం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు అపనమ్మకంగా ప్రవర్తించారు. యూదాగోత్రంలో జెరహు మునిమనుమడు, జబ్ది మనుమడు, కర్మీ కుమారుడు, ఆకాను నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నిటిని సొంతానికి తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు.
౨ యెహోషువ “మీరు వెళ్లి దేశాన్ని వేగు చూడండి” అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు. ౩ వారు వెళ్లి, హాయి పట్టణాన్ని వేగు చూసి యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చి “ప్రజలందరినీ పంపించకు, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకోవచ్చు, అందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్లనక్కరలేదు, హాయి ప్రజలు కొద్దిమందే ఉన్నారు” అన్నారు.
౪ కాబట్టి సుమారు మూడు వేలమంది సైనికులు అక్కడికి వెళ్ళారు గాని వారు హాయి ప్రజల ముందు నిలవలేక పారిపోయారు. ౫ హాయి ప్రజలు వారిలో ముప్ఫై ఆరుగురిని చంపేశారు. అదీ కాకుండా వారి పట్టణద్వారం దగ్గర నుండి షేబారీము వరకూ తరిమి మోరాదులో వారిని చంపేశారు.
కాబట్టి ఇశ్రాయేలీయుల గుండెలు కరిగి నీరైపోయాయి. ౬ యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. అతడూ ఇశ్రాయేలీయుల పెద్దలూ సాయంకాలం వరకూ యెహోవా మందసం ముందు నేలమీద ముఖాలు మోపి తలల మీద దుమ్మెత్తి పోసుకొంటూ ౭  “అయ్యో, ప్రభూ, యెహోవా, మమ్మల్ని నాశనం చేయడానికీ అమోరీయుల చేతికి అప్పగించడానికీ ఈ ప్రజలను యొర్దాను నదిని ఎందుకు దాటించావు? మేము యొర్దాను అవతల నివసించడమే మేలు కదా. ౮ ప్రభూ, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి? ౯ కనానీయులు, ఈ దేశ ప్రజలంతా ఇది విని, మమ్మల్ని చుట్టుముట్టి మా పేరు భూమి మీద ఉండకుండాా తుడిచి పెట్టేస్తారు. అప్పుడు ఘనమైన నీ నామం కోసం నువ్వు ఏం చేస్తావు” అని ప్రార్థించారు.
౧౦ అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు “లే, ఎందుకు ఇక్కడ నేల మీద ముఖం మోపుకున్నావు? ౧౧ ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధనను ఉల్లంఘించారు. శపితమైన దాన్ని కొంత దొంగిలించి, తమ సామానులో దాన్ని పెట్టుకున్నారు. ఆ పాపాన్ని కప్పిపుచ్చారు. ౧౨ కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండాా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను.
౧౩ నీవు వెళ్లి వారితో ఇలా చెప్పు, ‘రేపు ఉదయం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి ఉంది, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసేవరకూ మీ శత్రువుల ముందు మీరు నిలబడలేరు.’ ౧౪ ఉదయాన యెహోవా సూచించిన ప్రకారం మీ గోత్రాలు, వంశాలు, కుటుంబాల వారీగా పురుషులు ఒక్కొక్కరు వరుసగా యెహోవా దగ్గరికి రావాలి. ౧౫ అప్పుడు శపితమైనది ఎవరి దగ్గర దొరుకుతుందో అతన్నీ అతని వాళ్ళందరినీ అగ్నితో కాల్చివేయాలి. ఎందుకంటే అతడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలులో దుష్కార్యం చేశాడు” అని చెప్పాడు.
౧౬ కాబట్టి యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రాల వరుసలో రప్పించినప్పుడు యూదాగోత్రం పట్టుబడింది. ౧౭ యూదా వంశాన్ని రప్పించినప్పుడు జెరహీయుల వంశం పట్టుబడింది. జెరహీయుల వంశాన్ని ఒక్కొక్కరిని రప్పించినప్పుడు జబ్ది దొరికాడు. ౧౮ అతడినీ అతని ఇంటివారిని పురుషుల వరుస ప్రకారం రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరహు మునిమనుమడూ జబ్ది మనుమడూ కర్మీ కుమారుడూ అయిన ఆకాను దొరికాడు.
౧౯ అప్పుడు యెహోషువ ఆకానుతో “నా కుమారా, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ కలిగేలా, ఆయన ముందు ఏదీ దాచకుండా ఒప్పుకో, నీవు చేసినదాన్ని నాకు చెప్పు” అని అన్నాడు. ౨౦ అందుకు ఆకాను యెహోషువతో “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే. ౨౧ దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రాన్నీ, రెండువందల తులాల వెండినీ, యాభై తులాల బరువైన ఒక బంగారు కమ్మీనీ చూసి ఆశపడి వాటిని తీసుకున్నాను. అదిగో, వాటిని నా డేరా మధ్య నేలలో పాతిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉంది” అని తాను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు.
౨౨ అప్పుడు యెహోషువ దూతలను పంపినప్పుడు వారు అతని డేరా దగ్గరికి పరుగెత్తి చూశారు. వారు ఆ వస్తువులనూ వాటి కింద ఆ వెండినీ కనుక్కున్నారు. ౨౩ కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకు యెహోషువ దగ్గరకూ ఇశ్రాయేలీయుల దగ్గరకూ తెచ్చి యెహోవా సన్నిధిలో పోశారు.
౨౪ తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులు అందరూ జెరహు కుమారుడు ఆకానునూ, ఆ వెండినీ పైవస్త్రాన్నీ, బంగారు కమ్మీనీ, ఆకాను కుమారులనూ, కుమార్తెలనూ, ఎద్దులనూ, గాడిదలనూ, మందనూ, డేరానూ, అతనికి కలిగిన సమస్తాన్నీ పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు.
౨౫ అప్పుడు యెహోషువ “నీవెందుకు మమ్మల్ని బాధపెట్టావు? ఈ రోజు యెహోవా నిన్ను బాధిస్తాడు” అనగానే ఇశ్రాయేలీయులంతా అతణ్ణి రాళ్లతో చావగొట్టారు. ౨౬ తరువాత ఆ వస్తువులనూ రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వాటి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది ఈ రోజు వరకూ ఉంది. అప్పుడు యెహోవా తన కోపోద్రేకాన్ని విడిచిపెట్టాడు. అందుచేత ఇప్పటి వరకూ ఆ చోటికి “ఆకోరు లోయ” అని పేరు.