౧ యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. ౨  “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేన్నైనా పొరపాటున ఎవరైనా చేస్తే, మీరిలా చేయండి. ౩ నేరం ప్రజల పైకి వచ్చేలా ఒకవేళ అభిషేకం పొందిన యాజకుడే అలాంటి పాపం చేస్తే, అతడు తన పాపం కోసం బలిగా లోపం లేని కోడెదూడని యెహోవాకు అర్పించాలి.
౪ అతడు ఆ కోడెని ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. ఆ కోడె తలపైన తన చెయ్యి ఉంచి, తరువాత యెహోవా ఎదుట దాన్ని వధించాలి. ౫ అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారానికి తీసుకు రావాలి.
౬ తరువాత ఆ యాజకుడు తన వేలు ఆ రక్తంలో ముంచి అతి పరిశుద్ధ స్థలం తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడుసార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి. ౭ తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
౮ తరువాత అతడు పాపం కోసం బలి అర్పణ చేసిన ఆ కోడెదూడ కొవ్వు అంతా కోసి వేరుచేయాలి. దాని అంతర్భాగాలను కప్పి ఉన్న కొవ్వునూ, దాని అంతర్భాగాలను అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి. ౯ అలాగే దాని రెండు మూత్ర పిండాలనూ, వాటిపై పేరుకుని ఉన్న కొవ్వునూ, దాని మూత్రపిండాలకు దగ్గర కాలేయం పైన ఉన్న కొవ్వునూ కోసి వేరు చేయాలి. ౧౦ శాంతిబలి కోసం వధించే ఎద్దు నుండి తీసినట్టే యాజకుడు దీని నుండి కూడా తీయాలి. తరువాత యాజకుడు వీటిని దహన బలిపీఠం పైన దహించాలి.
౧౧ అతడు ఆ కోడె దూడలో ఇంకా మిగిలి ఉన్న భాగాలైన దాని చర్మం, మాంసం, తల, కాళ్ళు, దాని అంతర్భాగాలూ, పేడ, మిగిలిన భాగాలన్నిటినీ శిబిరం బయటకు తీసుకుపోవాలి. ౧౨ బూడిదను పారేసే శుద్ధమైన చోటికి తీసుకుపోయి అక్కడ బూడిద పారబోసే చోట కట్టెల పైన వాటిని దహించాలి.
౧౩ ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటుగా తెలియకుండా పాపం చేస్తే, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని అవగాహన లేకుండా చేసి దోషులైతే ౧౪ తరువాత వారు చేసిన పాపం వారికి తెలిసినప్పుడు, సమాజం ఒక కోడెదూడని పాపం కోసం బలిగా అర్పించాలి. దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి. ౧౫ సమాజానికి పెద్దలుగా ఉన్నవాళ్ళు యెహోవా సమక్షంలో దాని తలపై తమ చేతులుంచాలి. ఆ తరువాత యెహోవా సన్నిధిలో దాన్ని వధించాలి.
౧౬ అప్పుడు అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారానికి తీసుకుని రావాలి. ౧౭ తరువాత యాజకుడు ఆ రక్తంలో తన వేలును ముంచి తెరల ఎదుట యెహోవా సమక్షంలో ఏడు సార్లు చిలకరించాలి.
౧౮ తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాలి. ౧౯ తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి.
౨౦ ఈ విధంగా అతడు ఆ కోడెకి చేయాలి. పాపం కోసం బలి ఇచ్చే పశువుకు చేసినట్టుగానే దీనికీ చేయాలి. ఇలా యాజకుడు ప్రజల కోసం పరిహారం చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుంది. ౨౧ ఆ కోడెను శిబిరం బయటకు తీసుకుని వెళ్ళి మొదటి కోడెను దహించినట్టుగానే దీన్నీ దహించాలి. ఇది సమాజ పాపం కోసం చేసే బలి అర్పణ.
౨౨ ఒక అధికారి పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు. ౨౩ తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి.
౨౪ అతడు ఆ మేక తలపై చెయ్యి ఉంచి దాన్ని యెహోవా సమక్షంలో దహనబలి అర్పించే చోట వధించాలి. ఇది పాపం కోసం చేసే బలి. ౨౫ పాపం కోసం వధించిన దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
౨౬ దాని కొవ్వునంతా వేదిక పైన దహించాలి. శాంతిబలికి అర్పించిన పశువు కొవ్వును చేసినట్టుగానే చేయాలి. ఇలా యాజకుడు ఆ అధికారి పాపం విషయంలో పరిహారం చేయాలి. అప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది.
౨౭ సామాన్య ప్రజల్లో ఎవరైనా ఒకరు పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు. ౨౮ తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక ఆడ మేకను బలి అర్పణగా తీసుకుని రావాలి. ఆ మేక లోపం లేనిదై ఉండాలి.
౨౯ పాపం కోసం బలి కాబోయే పశువు తలపైన అతడు తన చేతులుంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి. ౩౦ దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
౩౧ తరువాత శాంతిబలి పశువు కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు ఆ కొవ్వును యెహోవాకు కమ్మని సువాసనగా బలిపీఠం పైన దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.
౩౨ ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకు రావాలి. ౩౩ అతడు పాపం కోసం బలి అర్పణ కాబోయే దాని తలపై తన చెయ్యి ఉంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి.
౩౪ అప్పుడు దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి. ౩౫ తరువాత శాంతిబలి పశువు క్రొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహనబలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.”