౧ ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హానానేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.
౨ వారిని ఆనుకుని యెరికో పట్టణం వారు కట్టారు, వారిని ఆనుకుని ఇమ్రీ కొడుకు జక్కూరు కట్టాడు.
౩ హస్సెనాయా వంశం వారు చేప ద్వారం కట్టారు. వారు దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
౪ వారిని ఆనుకుని హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు బాగుచేశాడు. అతని పక్కన మెషేజబెయేలు మనవడు బెరెక్యా కొడుకు మెషుల్లాము, అతని పక్కన బయనా కొడుకు సాదోకు బాగు చేశారు. ౫ వారిని ఆనుకుని తెకోవ ఊరివాళ్ళు బాగు చేశారు. అయితే తమ అధికారులు చెప్పిన పని చేయడానికి వారి నాయకులు నిరాకరించారు.
౬ పాసెయ కొడుకు యెహోయాదా, బెసోద్యా కొడుకు మెషుల్లాము పాత ద్వారం బాగుచేసి దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
౭ వారి పక్కన గిబియోనీయుడు మెలట్యా, మేరోనీతీవాడు యాదోను బాగుచేశారు. వాళ్ళు గిబియోను, మిస్పా పట్టణాల ప్రముఖులు. నది అవతలి ప్రాంతం గవర్నరు నివసించే భవనం వరకూ ఉన్న గోడను వారు బాగు చేశారు.
౮ వారి పక్కనే కంసాలి పనివారి బంధువు హర్హయా కొడుకు ఉజ్జీయేలు బాగుచేయడానికి సిద్ధమయ్యాడు. అతని పక్కనే పరిమళ ద్రవ్యాలు చేసే హనన్యా పని జరిగిస్తున్నాడు. వాళ్ళు వెడల్పు గోడ వరకూన్న యెరూషలేమును తిరిగి కట్టారు.
౯ వారి పక్కన యెరూషలేంలో సగ భాగానికి అధికారి హూరు కొడుకు రెఫాయా బాగు చేశాడు.
౧౦ అతని పక్కన హరూమపు కొడుకు యెదాయా తన యింటికి ఎదురుగా ఉన్న స్థలాన్ని బాగు చేశాడు. అతని పక్కన హషబ్నెయా కొడుకు హట్టూషు పని జరిగిస్తున్నాడు.
౧౧ రెండవ భాగాన్ని, అగ్నిగుండాల గోపురాన్ని హారిము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు బాగు చేశారు.
౧౨ వారి పక్కన యెరూషలేం నగరం సగభాగానికి అధికారి హల్లోహెషు కొడుకు షల్లూము, ఆతని కూతుళ్ళు బాగు చేశారు.
౧౩ హానూను, జానోహ కాపురస్థులు లోయ ద్వారం బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు, తాళాలు, గడులు అమర్చారు. ఇది కాకుండా పెంట ద్వారం వరకూ వెయ్యి మూరల గోడ కట్టారు.
౧౪ బేత్‌హక్కెరెం ప్రదేశానికి అధికారి రేకాబు కొడుకు మల్కీయా పెంట ద్వారం బాగుచేశాడు. దాన్ని కట్టి తలుపులు నిలబెట్టారు, తాళాలు, గడులు అమర్చాడు.
౧౫ ఆ తరువాత మిస్పా ప్రదేశానికి అధికారియైన కొల్హోజె కొడుకు షల్లూము ఊట ద్వారాన్ని తిరిగి కట్టి, దానికి పైకప్పు పెట్టి, తలుపులు నిలబెట్టారు, తాళాలు, గడులు అమర్చాడు. ఇంతేకాక, దావీదు నగరు నుండి దిగువకు వెళ్ళే మెట్ల దాకా రాజు తోటలో ఉన్న సిలోయము వాగు గోడ కూడా కట్టాడు.
౧౬ దాని పక్కన ఉన్న బేత్సూరులో సగ భాగాన్ని అధికారి అజ్బూకు కొడుకు నెహెమ్యా బాగు చేశాడు. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకూ కట్టి ఉన్న కోనేరు వరకూ, యుద్ధవీరుల ఇళ్ళ వరకూ కట్టాడు.
౧౭ దాని పక్కన లేవీయులు బాగుచేశారు. వారిలో బానీ కొడుకు రెహూము ఉన్నాడు. దాన్ని ఆనుకుని అధికారి హషబ్యా తన భాగం నుండి కెయిలాకు చెందిన సగభాగం దాకా బాగు చేశాడు.
౧౮ కెయీలాలో సగభాగానికి అధికారిగా ఉన్న వారి సహోదరుడు, హేనాదాదు కొడుకు బవ్వై బాగు చేశాడు.
౧౯ దాని పక్కన మిస్పాకు అధిపతి అయిన యేషూవ కొడుకు ఏజెరు ఆయుధాగారం దారికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన, మరో భాగం బాగు చేశాడు.
౨౦ ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడు ఎల్యాషీబు ఇంటి ద్వారం దాకా ఉన్న మరొక భాగాన్ని జబ్బయి కొడుకు బారూకు శ్రద్ధగా బాగు చేశాడు.
౨౧ హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు మరొక భాగాన్ని అంటే ఎల్యాషీబు ఇంటి ద్వారం నుండి చివరి వరకూ బాగు చేశాడు.
౨౨ దాన్ని అనుకుని యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే యాజకులు బాగు చేశారు.
౨౩ దాని పక్కన తమ యింటికి ఎదురుగా బెన్యామీను, హష్షూబు అనేవారు బాగు చేశారు. దాన్ని ఆనుకుని అనన్యా మనవడు, మయశేయా కొడుకు అజర్యా తన యింటి దగ్గర బాగు చేశాడు.
౨౪ అజర్యా ఇంటి దగ్గర నుంచి గోడ మలుపు మూల వరకూ మరో భాగాన్ని హేనాదాదు కొడుకు బిన్నూయి బాగు చేశాడు.
౨౫ ఆ భాగాన్ని ఆనుకుని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజు భవనం ఉండే మహా గోపురం దాకా ఊజై కొడుకు పాలాలు బాగు చేశాడు. దాని పక్కన పరోషు కొడుకు పెదాయా బాగు చేశాడు.
౨౬ ఓపెలులో నివసించే దేవాలయ సేవకులు తూర్పున నీటి ద్వారం పక్కన, గోపురం దగ్గర బాగు చేశారు.
౨౭ తెకోవీయులు ఓపెలు గోడ వరకూ గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న మరో భాగాన్ని బాగు చేశారు.
౨౮ గుర్రం ద్వారం దాటుకుని ఉన్న యాజకులంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా బాగు చేశారు.
౨౯ వారి పక్కన ఇమ్మేరు కొడుకు సాదోకు తన ఇంటికి ఎదురుగా బాగు చేశాడు. తూర్పు ద్వారాన్ని కాపలా కాసే షెకన్యా కొడుకు షెమయా దాని పక్కన బాగు చేశాడు.
౩౦ దాని పక్కన షెలెమ్యా కొడుకు హనన్యా, జాలాపు ఆరవ కొడుకు హానూను మరో భాగాన్ని బాగు చేశారు. బెరెక్యా కొడుకు మెషుల్లాము తన గదికి ఎదురుగా ఉన్న స్థలం బాగు చేశాడు.
౩౧ ఆలయ సేవకుల స్థలానికి, పరిశీలన ద్వారానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకూ కంసాలి మల్కీయా బాగు చేశాడు.
౩౨ మూలనున్న పై గది నుండి గొర్రెల ద్వారం మధ్య వరకూ కంసాలులు, వర్తకులు బాగు చేశారు.