౧ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ౨  “ఇశ్రాయేలు ప్రజలకి ఇలా ఆజ్ఞాపించు. చర్మంలో అంటువ్యాధి కలిగిన వాణ్ణీ, శరీరంలో నుండి స్రావం అవుతున్న వాణ్ణీ, శవాన్ని ముట్టుకుని అపవిత్రుడైన వాణ్ణి శిబిరంలో నుండి బయటికి పంపివేయాలి. ౩ వారు ఆడవారైనా మగవారైనా శిబిరం నుండి బయటకు పంపించి వేయాలి. వారు శిబిరాన్ని కలుషితం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను శిబిరంలో వారి మధ్య నివసిస్తున్నాను.” ౪ ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అలాంటి వారిని శిబిరం బయటకు వెళ్ళగొట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు విధేయత చూపారు.
౫ యెహోవా మరోసారి మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ౬ పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. ౭ అప్పుడు అతడు తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన పాపం వల్ల కలిగిన నష్టాన్ని అతడు చెల్లించాలి. ఆ రుసుముకి అదనంగా దానిలో ఐదో వంతు కలిపి చెల్లించాలి. తాను ఎవరికి విరోధంగా పాపం చేసాడో వారికి దాన్ని చెల్లించాలి.
౮ ఆ అపరాధ చెల్లింపుని తీసుకోడానికి ఆ వ్యక్తికి దగ్గర బంధువు ఎవరూ లేకుంటే అతడు ఆ సొమ్మును యాజకుడి ద్వారా నాకు చెల్లించాలి. దాంతోపాటు ఒక పొట్టేలును తన పరిహారం కోసం అర్పించాలి. ఆ సొమ్ముతో పాటు పొట్టేలు కూడా యాజకునిదవుతుంది. ౯ ఇశ్రాయేలు ప్రజలు యాజకునికి సమర్పించేదీ, నా కోసం ప్రతిష్టించినదీ ఏదైనా యాజకునికే చెందుతుంది. ౧౦ ప్రతిష్టిత వస్తువులు ఎవరి దగ్గర ఉన్నా అవి యాజకునికే చెందుతాయి. యాజకునికి ఇచ్చింది యాజకునికే చెందుతుంది.”
౧౧ యెహోవా మళ్ళీ మోషేతో మాట్లాడాడు. ౧౨  “ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు. ఎవరైనా ఒకడి భార్య దారి తప్పి అతడికి ద్రోహం చేసినప్పుడు, ౧౩ అంటే వేరే వ్యక్తి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడనుకోండి. అప్పుడు ఆమె అపవిత్రం అయినట్టే. ఆ విషయాన్ని ఆమె భర్త చూడకపోయినా, అతనికి తెలియక పోయినా, ఆ కార్యం చేస్తుండగా ఎవరూ పట్టుకోకపోయినా, ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయినా ఆమె పట్టుబడదు. ౧౪ కానీ ఆ భర్త మనస్సులో రోషం పుట్టి తన భార్య అపవిత్రమైన సంగతి గ్రహిస్తే, లేదా ఆమె అపవిత్రం కాకపోయినా అలాంటిదే అనుమానం అతని మనస్సులో కలిగితే అతడు చేయాల్సింది ఇది.”
౧౫ అలాంటి విషయంలో ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. ఆమెతో పాటు తూమెడు యవల పిండిలో పదో వంతు కూడా తీసుకు రావాలి. దానిమీద నూనె పోయకూడదు. సాంబ్రాణి వేయకూడదు. ఎందుకంటే అది రోషాన్ని సూచించే నైవేద్యం. పాపాన్ని సూచించడానికి చేస్తున్న నైవేద్యం.
౧౬ యాజకుడు ఆమెను యెహోవా సమక్షానికి తీసుకురావాలి. ౧౭ తరువాత యాజకుడు మట్టికుండలో పవిత్రజలం తీసుకోవాలి. మందిరం నేలపైనుండి కొంత ధూళి తీసుకుని ఆ నీళ్ళలో కలపాలి.
౧౮ తరువాత యాజకుడు యెహోవా సమక్షంలో ఆ స్త్రీని నిలబెట్టాలి. ఆ స్త్రీ తలపై ముసుగుని తీసి ఆమె జుట్టు జడలు విప్పాలి. రోషం కారణంగా చేసిన నైవేద్యాన్ని అంటే పాపానికి సూచనగా ఉన్న నైవేద్యాన్ని యాజకుడు ఆమె చేతుల్లో ఉంచాలి. ఇది రోషం కారణంగా చేసిన నైవేద్యం. ఆ సమయంలో శాపాన్ని కలిగించే చేదు నీళ్ళు యాజకుడి చేతిలో ఉండాలి. ౧౯ అప్పుడు యాజకుడు ఆ స్త్రీతో ఒట్టు పెట్టించి ఇలా చెప్పాలి. “ఏ పురుషుడూ నీతో లైంగికంగా కలవక పొతే, నువ్వు దారి తప్పి అపవిత్ర కార్యం చేయకపోతే శాపాన్ని కలిగించే ఈ చేదు నీళ్ళు నీపై ప్రభావం చూపించవు.
౨౦ కానీ భర్త ఆధీనంలో ఉన్న నువ్వు దారి తప్పి ఉంటే, అపవిత్రురాలివైతే, వేరే వ్యక్తి నీతో సంబంధం పెట్టుకుంటే” ౨౧ ఇక్కడ యాజకుడు ఆమె పైకి శాపం వచ్చేట్లు ఆమెతో ఒట్టు పెట్టించాలి. తరువాత తన మాటలు కొనసాగించాలి. “యెహోవా నీ ప్రజల్లో అందరికీ తెలిసేలా నిన్ను శాపానికి గురిచేస్తాడు గాక. నీ తొడలు బలహీనమై నీ కడుపు ఉబ్బిపోతుంది. ౨౨ శాపాన్ని కలిగించే ఈ నీళ్ళు నీ కడుపులోకి వెళ్లి నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా చేసి నీ తొడలను బలహీనం చేస్తాయి.” యాజకుడు ఇలా చెప్పిన తరువాత ఆ స్త్రీ “నేను దోషినైతే అలాగే జరగాలి” అని చెప్పాలి.
౨౩ యాజకుడు అప్పుడు ఆ శాపాలను ఒక పత్రం పైన రాయాలి. రాసిన ఆ శాపాలను చేదు నీళ్ళతో తుడిచి వేయాలి.
౨౪ తరువాత యాజకుడు శాపాన్ని కలిగించే ఆ చేదు నీళ్ళని ఆమెతో తాగించాలి. శాపాన్ని కలిగించే ఆ నీళ్ళు ఆమెలో చేదును పుట్టిస్తాయి. ౨౫ తరువాత యాజకుడు రోషం కారణంగా అర్పించిన నైవేద్యాన్ని ఆమె చేతిలోనుండి తీసుకుని యెహోవా సమక్షంలో పైకి ఎత్తి, ఊపి దాన్ని బలిపీఠం దగ్గరకి తీసుకురావాలి. ౨౬ తరువాత యాజకుడు ఆ నైవేద్యంలోనుండి ఓ గుప్పెడు తీసి బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఆ తరువాత ఆ నీళ్ళను ఆమెకు తాగించాలి.
౨౭ యాజకుడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించినప్పుడు ఒకవేళ ఆమె అపవిత్రురాలై తన భర్తకి ద్రోహం చేసి ఉంటే శాపం కలుగజేసే ఆ నీళ్ళు ఆమె కడుపులోకి వెళ్ళి చేదు అవుతాయి. ఆమె పొత్తి కడుపు వాచి ఉబ్బుతుంది. ఆమె తొడలు బలహీనం అవుతాయి. ఆమె తన ప్రజల్లో శాపగ్రస్తురాలవుతుంది. ౨౮ ఒకవేళ ఆ స్త్రీ అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటే విడుదల పొందుతుంది. ఆమె సంతానం పొందడానికి యోగ్యురాలవుతుంది.
౨౯ రోషం గురించిన చట్టం ఇది. భర్త ఆధీనంలో ఉన్న ఏ స్త్రీ అయినా దారి తప్పి అపవిత్రురాలైనప్పుడు పాటించాల్సిన చట్టం ఇది. ౩౦ ఒకవేళ భర్తకు తన భార్యపై రోషం కలిగినా ఇదే చట్టం పాటించాలి. అతడు ఆమెను యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. ఈ రోషం గురించిన చట్టం వివరించిన వాటన్నిటినీ యాజకుడు ఆమె విషయంలో సమస్తం జరిగించాలి.
౩౧ అప్పుడు ఆ వ్యక్తి తన భార్యను యాజకుడి దగ్గరకి తీసుకు వచ్చిన నేరం నుండి విముక్తుడవుతాడు. ఆ స్త్రీ ఏదన్నా అపరాధం చేస్తే ఆ శిక్ష భరించాలి.