౧౫
౧ తరువాత యెహోవా మోషేతో మాట్లాడుతూ, ౨  “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘యెహోవా మీకిస్తున్న ఆ ప్రదేశంలోకి మీరు వెళ్ళినప్పుడు, ౩ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా మందలోని పశువుల్లో, దహనబలిగానైనా, బలిగానైనా తెచ్చి, మొక్కుబడి చెల్లించడానికి గాని, స్వేచ్ఛార్పణగా గాని, నియామక కాలంలో అర్పించేదిగా గాని, దేనినైనా మీరు అర్పించాలనుకున్నారనుకోండి.
౪ యెహోవాకు ఆ అర్పణ అర్పించేవాడు ముప్పావు నూనెతో కలిపిన రెండున్నర కిలోల పిండిని నైవేద్యంగా తేవాలి. ౫ ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి ముప్పావు లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి. ౬ పొట్టేలుతో పాటు ఒక పడి నూనెతో కలిపిన నాలుగు లీటర్ల పిండిని నైవేద్యంగా సిద్ధం చెయ్యాలి ౭ ఒక లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
౮ మొక్కుబడి చెల్లించడానికైనా, యెహోవాకు సమాధానబలి అర్పించడానికైనా, నువ్వు దహనబలిగానైనా, బలిగానైనా లేత దున్నపోతును సిద్ధం చేస్తే, ౯ దానితో పాటు, లీటరున్నర నూనె కలిపిన ఏడున్నర కిలోల గోదుమపిండిని నైవేద్యంగా అర్పించాలి. ౧౦ ఇంకా, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహన బలిగా మీరు తేవలసినవి.
౧౧ లీటరున్నర ద్రాక్షారసం పానీయార్పణగా తేవాలి. ఒక్కొక్క కోడెతోపాటు, ఒక్కొక్క పొట్టేలుతోపాటు, గొర్రెల్లోనైనా, మేకల్లోనైనా ఒక్కొక్క పిల్లతో పాటు ఆ విధంగా చెయ్యాలి. ౧౨ మీరు సిద్ధపరిచే వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికీ ఆ విధంగా చెయ్యాలి. ౧౩ దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పణ తెచ్చేటప్పుడు ఆ విధంగానే చెయ్యాలి.
౧౪ మీ దగ్గర నివాసం ఉన్న పరదేశిగాని, మీ తరతరాల్లో మీ మధ్య ఉన్నవాడు ఎవడైనా గాని యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగిన దహనబలి అర్పించాలని అనుకున్నప్పుడు, మీరు చేసినట్టే అతడు కూడా చెయ్యాలి. ౧౫ సమాజానికి, అంటే మీకూ, మీలో నివాసం ఉన్న పరదేశికీ ఒకే కట్టడ. అది మీ తరతరాలకు ఉండే శాశ్వతమైన కట్టుబాటు. యెహోవా సన్నిధిలో మీరున్నట్టే పరదేశి కూడా ఉండాలి. ౧౬ మీకూ, మీ దగ్గర నివాసం ఉండే పరదేశికీ ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి ఉండాలి’ ” అన్నాడు.
౧౭ యెహోవా మోషేతో మళ్ళీ మాట్లాడుతూ “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ౧౮ నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ౧౯ మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు యెహోవాకు ప్రతిష్ట అర్పణ అర్పించాలి.
౨౦ మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. కళ్లపు అర్పణలా దాన్ని అర్పించాలి. ౨౧ మీ తరతరాలకు మీ మొదటి పిండిముద్దలోనుంచి ప్రతిష్ఠార్పణను యెహోవాకు అర్పించాలి” అన్నాడు.
౨౨  “యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో, అంటే ౨౩ యెహోవా ఆజ్ఞాపించిన రోజు మొదలుకుని ఆ తరువాత మీ తరతరాలకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చెయ్యనప్పుడు, అది సమాజానికి తెలియజేస్తే, ౨౪ సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండడానికి దహనబలిగా ఒక లేత దున్నపోతును ఆజ్ఞప్రకారం దాని నైవేద్యాన్ని, దాని పానీయార్పణను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధం చెయ్యాలి.
౨౫ యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజం కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. తెలియక దాన్ని చేశారు గనక క్షమాపణ దొరుకుతుంది. వారు పొరపాటున చేసిన పాపాలను బట్టి తమ అర్పణ, అంటే యెహోవాకు చెందవలసిన దహనబలి, పాపపరిహారార్థబలి యెహోవా సన్నిధికి తీసుకు రావాలి. ౨౬ అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజానికి గాని, వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశికి గాని, క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే, ప్రజలందరూ తెలియక దాన్ని చెయ్యడం జరిగింది.
౨౭ ఒకడు పొరపాటున పాపం చేస్తే, అతడు పాపపరిహారార్థ బలిగా ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆడమేక పిల్లను తీసుకురావాలి. ౨౮ పొరపాటుగా యెహోవా సన్నిధిలో దాన్ని చేశాడు గనక తెలియక పాపం చేసిన అతని కోసం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అతడు క్షమాపణ పొందుతాడు. ౨౯ ఇశ్రాయేలీయుల్లో పుట్టినవాడు గాని వారి మధ్య నివాసం ఉంటున్న పరదేశి గాని పొరపాటున ఎవరైనా పాపం చేస్తే, అతనికీ, మీకూ ఒక్కటే చట్టం ఉండాలి.
౩౦ కాని, దేశంలో పుట్టినవాడు గాని పరదేశి గాని ఎవరైనా కావాలని పాపం చేస్తే, ౩౧ అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు” అన్నాడు.
౩౨ ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరడం గమనించారు. ౩౩ అతడు కట్టెలు ఏరడం చూసిన వారు మోషే అహారోనుల దగ్గరికి, సమాజం ఎదుటికి అతన్ని తీసుకొచ్చారు. ౩౪ అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు.
౩౫ తరువాత యెహోవా మోషేతో “ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి. ౩౬ సర్వసమాజం శిబిరం బయట అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి” అన్నాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజం శిబిరం బయటకు అతన్ని తీసుకెళ్ళి, రాళ్లతో కొట్టి చంపారు.
౩౭ ఇంకా యెహోవా మోషేతో మాట్లాడుతూ, ౩౮  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, వారు తమ తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని, అంచుల కుచ్చుల మీద నీలిరంగు దారం తగిలించాలి. ౩౯ మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.
౪౦ మీరు నాకోసం ప్రత్యేకపరచిన వారు గనక, మీరు పవిత్రులుగా ఉండేందుకు యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించడానికి జాగ్రత్త తీసుకోండి. ౪౧ నేను మీకు దేవుడుగా ఉండాలని ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.”