౩౬
౧ యోసేపు కొడుకుల వంశాల్లో మాకీరు కొడుకు, మనష్షే మనమడు అయిన గిలాదు వంశం పెద్దలు వచ్చి మోషేతో, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల నాయకులతో ఇలా అన్నారు, ౨  “ఈ దేశాన్ని చీటీల ప్రకారం ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇవ్వాలని యెహోవా మా ఏలికవైన నీకు ఆజ్ఞాపించాడు. మా సోదరుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతని కూతుళ్ళకు ఇవ్వాలని కూడా యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. ౩ అయితే వారు ఇశ్రాయేలీయుల్లో ఇతర గోత్రాల వారిని ఎవరిని పెళ్లి చేసుకున్నా వారి వారసత్వం మా పూర్వీకుల వారసత్వం నుండి తీసి, వారు చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోయి, మా గోత్రానికి వచ్చిన చీటీల ప్రకారం లభించిన వారసత్వం నుండి వేరైపోతుంది. ౪ కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి వంతు వారు పెళ్లి చేసుకున్న గోత్రపు వారసత్వంతో కలిసిపోతుంది కాబట్టి ఆ మేరకు మా పూర్వీకుల గోత్ర వారసత్వం తగ్గిపోతుంది.”
౫ అప్పుడు మోషే యెహోవా మాట ప్రకారం ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు. “యోసేపు కొడుకుల గోత్రికులు చెప్పింది న్యాయంగానే ఉంది. ౬ యెహోవా సెలోపెహాదు కూతుళ్ళ గురించి చెప్పింది ఏమిటంటే, వారు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకోవచ్చు గాని, తమ తండ్రి గోత్ర వంశాల్లోనే చేసుకోవాలి. ౭ ఇశ్రాయేలీయుల వారసత్వం ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోకి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కడూ తన పూర్వీకుల గోత్ర వారసత్వానికి కట్టుబడి ఉండాలి. ౮ ఇశ్రాయేలీయులకు వారి పూర్వీకుల వారసత్వం కలిగేలా ఇశ్రాయేలీయుల గోత్రాల్లో వారసత్వం ఉన్న ప్రతి యువతీ తన తండ్రి గోత్రంలోనే వివాహం చేసుకోవాలి. ౯ వారసత్వం ఒక గోత్రం నుండి మరొక గోత్రానికి వెళ్ళకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రాలు వారి వారి వారసత్వాల్లోనే నిలిచి ఉండాలి.”
౧౦ యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా సెలోపెహాదు కూతుళ్ళు చేశారు. ౧౧ మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా అనే సెలోపెహాదు కూతుళ్ళు తమ తండ్రి సోదరుని కొడుకులను వివాహం చేసుకున్నారు. ౧౨ అంటే యోసేపు కొడుకులైన మనష్షీయులను వివాహం చేసుకోవడం వలన వారి వారసత్వం వారి తండ్రి గోత్రంలోనే ఉండిపోయింది. ౧౩ ఇవి యెరికో దగ్గర యొర్దానుకు సమీపంగా ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులు, ఆజ్ఞలు.