౫౩
ప్రధాన సంగీతకారుని కోసం. మహలతు రాగంలో దావీదు రాసిన దైవధ్యానం.
౧ దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు.
౨ జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు.
౩ వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు.
౪ వారు దేవునికి ప్రార్థన చేయరు. రొట్టెను తిన్నట్టుగా నా ప్రజలను తినేస్తూ దుర్మార్గం జరిగిస్తారు. వారికి ఏమీ తెలియడం లేదా?
౫ భయకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు. దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు.
౬ సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.