౫౮
ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం)
౧ మనుషులారా, మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులారా, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా?
౨ లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.
౩ దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.
౪ వారు చిమ్మేది నాగుపాము విషం. వారు చెవులు మూసుకున్న చెవిటి పాముల వంటివారు.
౫ మంత్రగాళ్ళు ఎంతో నేర్పుగా మంత్రం వేసినా వారు ఎంతమాత్రం పట్టించుకోరు.
౬ దేవా, వారి నోట్లో పళ్ళు విరగ్గొట్టు. యెహోవా, ఆ సింహం పిల్లల కోరలు ఊడబెరుకు.
౭ పారుతున్న నీరులాగా వారు గతించిపోతారు గాక. వారు విడిచిన బాణాలు ముక్కలుగా విరిగిపోతాయి గాక.
౮ వారు కరిగిపోయి కనిపించకుండా పోయే నత్తల్లాగా ఉంటారు. నవమాసాలు నిండకుండానే పుట్టే పిండంలాగా సూర్యుణ్ణి ఎన్నటికీ చూడలేరు.
౯ మీ కుండలకు ముళ్లకంపల మంట వేడి తగలకముందే అది ఉడికినా ఉడకకపోయినా ఆయన సుడిగాలిలో దాన్ని ఎగరగొడతాడు.
౧౦ వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.
౧౧ కాబట్టి నీతిమంతులకు కచ్చితంగా బహుమానం కలుగుతుంది. న్యాయం తీర్చే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు, అని మనుషులు ఒప్పుకుంటారు.